సుప్రీం తీర్పు..

 అక్షరవిజన్ న్యూస్.. న్యూఢిల్లీ..  పరారీలో ఉన్న మాజీ లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. 2017 ఏప్రిల్ 18న మాల్యాను భారత్ కు అప్పగించేందుకు వారెంట్ జారీ కాగా, మాల్యా ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. 2016 నుంచి మాల్యా యూకేలో తలదాచుకుంటున్నారు.కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడినందుకు మాల్యాకు నాలుగు నెలల జైలు, రూ.2,000 చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాల్యా ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, అందుకు తగిన శిక్ష అవసరమని భావించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాల్యా తన కుటుంబ పిల్లలకు లోగడ 40 మిలియన్ డాలర్లు పంపించారు. వాటిని కోర్టుకు తిరిగి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.మాల్యా వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశాన్ని ఇచ్చినట్టు గుర్తు చేసింది. రూ.9,000 కోట్ల రుణాలు చెల్లించడంలో మాల్యా విఫలం కావడంతో ఎస్ బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. తన ఆస్తులను మాల్యా వెల్లడించలేదని, వాటిని తన పిల్లల పేరిట బదిలీ చేసుకుని నిబంధనలను తుంగలో తొక్కినట్టు విచారణలో గుర్తించారు..

Comments