అత్యుత్తమమైన సాంకేతికత..

 అక్షరవిజన్ న్యూస్.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు అధికారులు అత్యుత్తమ సాంకేతికత కలిగి ఉన్నారని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాపై బీఆర్కే భవన్‌లో పోలీసు, ఆబ్కారీ, అటవీ, గిరిజనశాఖ ఉన్నతాధికారులతో సీఎస్‌ సమావేశమయ్యారు. పోలీసులకు ఇచ్చిన ఆధునిక సాంకేతికతతో పలు రాష్ట్రాల నుంచి రవాణా అవుతున్న మాదకద్రవ్యాలను గుర్తిస్తున్నామని తెలిపారు. మిగిలిన అన్ని శాఖలు కూడా డ్రగ్స్‌ వినియోగం, సరఫరాను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వం కూడా ఎన్‌సీబీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుందన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టే దిశలో 3 నెలలకోసారి రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపిన ఆయన... గంజాయి పెంచుతున్నారన్న సమాచారంతో పలువురికి రైతు బంధు నిలిపివేశామని గుర్తు చేశారు. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తున్నామని, ఇప్పటికే కట్టడి చేసేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమావేశంలో సీఎస్‌, డీజీపీతో పాటు హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, సీఐడీ డీజీ గోవింద్‌ సింగ్‌, ఎన్‌సీబీ జాయింట్‌ డైరెక్టర్‌ అరవిందన్‌, అబ్కారీ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, అటవీ, గిరిజన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments